సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

 



 


సమ్మె విరమించిన 108 ఉద్యోగులు
 
 108 ఉద్యోగులు సమ్మె విరమించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమవడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. సోమవారం రాత్రి నుంచి 108 సిబ్బంది సమ్మెకు దిగారు. ఆ తర్వాత ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో 108 ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎం జగన్‌ను కలిశారు. 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు సీఎంను కోరారు. 108 వాహనాలను ప్రభుత్వమే నిర్వహించడం సహా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 31లోపు వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఉద్యోగ భద్రతకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని.. త్వరలోనే దాన్ని అమలు చేయనున్నట్లు జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 108 ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. గురువారం రాత్రి నుంచే విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు.