ఒక్క వారం లేకపోతె అంతా రచ్చ రచ్చ చేశారు - నేతలపై చండ్రనిప్పులు చెరిగిన జగన్

ఒక్క వారం లేకపోతె అంతా రచ్చ రచ్చ చేశారు – నేతలపై చండ్రనిప్పులు చెరిగిన జగన్ : తొలిసారి ఇంత ఆగ్రహం అంటున్న సీనియర్లు


తాను వారం రోజులు రాష్ట్రంలో లేకపోతే ఇంత రచ్చ చేస్తారా ? ఇన్ని సమస్యలు తెచ్చి పెడతారా ? మిమ్మల్లి నమ్ముకుంటే కష్టమేనంటూ పార్టీ నాయకులను, మంత్రులను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దులిపేశారని ప్రచారం జరుగుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన జగన్‌ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. దీనిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో వ్యవహరించిన అంశంపై తీవ్ర చర్చ జరిగిందని తెలుస్తోంది. తాము ఏ పనిచేసినా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చెప్పే చేస్తున్నామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బిజెపి పెద్దలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంపై జగన్‌ ప్రశ్నించారని తెలుస్తోంది. ఎవరిని అడిగి ఆ వ్యాఖ్యలు చేశారని, దీని పర్యవసానాలు ఏమిటో తెలియవా ? అన్నారని, ఇది ఎందుకు జరిగిందని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తాము ఏమి చేసినా కేంద్రానికి చెబుతున్నామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి ఇబ్బందులు కల్గించాయని జగన్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ తరువాత చోటు చేసుకున్నపరిణామాలు, బిజెపి నేతలు ఒక్కసారిగా ప్రభుత్వంపై దండెత్తడం



తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా అన్యమత ప్రచారంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ నాయకులు ఒక్కసారిగా దండెత్తిన వైనంపై జగన్‌ ఆగ్రహించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి బస్సులో టిక్కెట్లవెనుక అన్యమతం ప్రచారం చేయడంపై బిజెపి స్థానిక నేతలతో పాటు, జాతీయ నేతలు తీవ్రంగా స్పందించడంపై జగన్‌ ప్రశ్నించారని, ఈ సమస్యను హ్యాండిల్‌ చేయలేక పోయారని, దీని వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా ? ఇదెంత దూరం పోతుందో ఎవరికీ తెలియదని, రాజకీయంగా నష్టపోతామని, తాను రాష్ట్రంలో లేని సమయంలో ఇటువంటి ప్రచారం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన వారు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇబ్బందికి తెచ్చిపెట్టాయంటున్నారు. దీనిపై కూడా కొంత చర్చ జరిగిందంటున్నారు. బొత్స పార్టీ లైన్‌కు అనుగుణంగానే మాట్లాడినా దానిపై ఒక్కసారిగా ప్రతిపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించాయని భావించారు. మరో వైపు వరదల సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేయలేకపోయారనే అభిప్రాయంతో సిఎం ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముంచడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా తమ పని తాము చేసుకుని పోయినట్లయితే బాగుండేదని ఈ విషయంలో ఒక వ్యూహం ప్రకారం పనిచేయలేకపోయారని జగన్‌ వ్యాఖ్యానించారని సమాచారం. రాజధాని, పోలవరం విషయాల్లో పెద్దగా జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా ఢిల్లీలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, అన్యమత ప్రచారంపై తగిన రీతిలో స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మొత్తం మీద తాను వారం రోజులు అందుబాటులో లేకపోతే అందరూ కలసి రచ్చ రచ్చ చేశారని, సమిష్టిగా పనిచేయకపోతే ఇలానే ఉంటుందని అన్నారట. కాగా బిజెపి పెద్దలతో వచ్చిన గ్యాప్‌ను పూడ్చుకోవడానికి జగన్‌ త్వరలో ఢిల్లీకి వెళతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాను లేని వారం రోజుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి జగన్‌ ప్రయత్నాలు చేయబోతున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.


సాములు మీరు పూడ్చుకోలేనంత నష్టం 87 రోజుల్లో జరిగిపోయింది.