ఏపీ ఖజానాని ఖాళీ చేస్తున్న జగన్ సలహాదారులు 

 



ఏపీ ఖజానాని నాకేస్తున్న జగన్ సలహాదారులు 
-సాక్షి తెల్ల ఏనుగులలో ఒక్కొక్కరికీ సర్కారు నుంచి రూ.6 కోట్ల నజరానా
-సాక్షి ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియామకం
-ఇక నుంచి ఏపీ ప్రజాధనమే సాక్షి పెద్దలకు జీతంగా ఫలహారం
-ఒక్కొక్క సలహాదారుడు(సాక్షి)కి నెలకు రూ.3లక్షలకు పైగానే జీతం
-ఒక్కొక్కరి వాహనం కొనేందుకు 10 లక్షలు
-టిఫిన్ చేసే స్పూన్ల కోసం ఒక్కో సలహాదారుడికి రూ.1.50 మంజూరు
-ఫర్నిచర్ కింద మరో రూ.3 లక్షలు చెల్లింపు
-ఒక్కో సాక్షి పెద్ద తలకాయ దగ్గర పనిచేసేందుకు 8 మంది ఉద్యోగులు
-ఈ ఎనిమిది మంది ఉద్యోగులకు జీతాలు కింద నెలకు రూ.3లక్షలు 
-కంప్యూటర్ కొనేందుకు రూ.50 వేలు


నాది కాకపోతే ఢిల్లీదాకా దేకుతానన్నాట్ట వెనకటి ఒకడు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాగే తనది కానీ ఏపీ ప్రజాధనాన్ని తన క్విడ్ ప్రోకో మానసపుత్రిక సాక్షిలో పనిచేసే  పెద్దతలకాయల కోసం పప్పుబెళ్లాల్ల పంచేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్ దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు.  తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని కూడా తన సోషల్ మీడియా ద్వారా బాగానే ప్రచారం చేసుకున్నారు. తీరా పగ్గాలు చేపట్టాక దయనీయ స్థితిలో ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన సర్కారు ఖజానాను తన దుబారా ఖర్చులతో కోట్లలో కొల్లగొడుతున్నారు. తన తాడేపల్లి ఇంటితోపాటు తెలంగాణలోని లోటస్ పాండ్ కోసం కోట్లు విడుదల చేస్తూ జీవోలిచ్చారు. తాజాగా మొక్కు తీర్చుకునేందుకు జెరూసలెం కుటుంబంతో వెళ్తూ తన సొంత ఖర్చుతో వెళ్తున్నానని ఆడంబరంగా ప్రకటించుకుని, సెక్యూరిటీ ఖర్చుల పేరుతో 25 లక్షల మేరకు విడుదల చేయించుకున్నారు. లక్షల కోట్లు అక్రమార్జనకు అలవాటైన ప్రాణం జగన్ ది. తన తండ్రి ముఖ్యమంత్రి అయితేనే 2 లక్షల కోట్లకుపైగానే కొల్లగొట్టిన ఘనచరిత్ర గలిగిన అక్రమాస్తుల కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ని రావాలి, కావాలి అంటూ జనం ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైకి తెచ్చారు. తాను దోపిడీ దొంగనని తెలిసినా, గెలిపించిన ప్రజలు..తాను ఎంత దోచుకున్న ఏం చేయలేరనే ధీమా జగన్ లో బాగా నాటుకుపోయింది. ముఖ్యమంత్రి అయ్యాక తన సామాజికవర్గానికి మొత్తం నామినేటెడ్ పదవులు కట్టబెట్టేశారు. ఇక మిగిలింది తన క్విడ్ ప్రోకో మానసపుత్రిక సాక్షి. దీనికి ప్రకటనల రూపంలో కోట్లు పందేరం చేశారు. సాక్షిలో తెల్ల ఏనుగులుగా పేరుగాంచి నెలకు లక్షకు పైబడి జీతం తీసుకునే కొన్ని పెద్ద తలకాయలను ఏకంగా సలహాదారులుగా కేబినెట్ ర్యాంకు ఇచ్చి తీసుకున్నారు. ఇక నుంచి వీరికి సాక్షి నుంచి జీతాలు ఇచ్చే పని లేకుండా ఏకంగా ఏపీ సర్కారు నుంచే రైట్ రాయల్ గా దోచి పెట్టే మార్గం కనిపెట్టారు. 
ఒక్కొక్కరు 6 కోట్ల పైనే బొక్కేస్తున్నారు
జగన్ బంధువు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా జీతం తీసుకునే వారు. ఆ తరువాత వైకాపా వ్యవహారాలు చూసినా సాక్షి నుంచి జీతం వచ్చేది. ఇప్పుడు ఆయనను ప్రజాసంబంధాల సలహాదారుడిగా నియమించారు. ఆయనకు నెలకు జీతం, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులకు చెల్లించే జీతాలు, ఇతర ఖర్చులు కలిపి నెలకు 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజల ధనం అంటే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారన్నమాట. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. ఆ తరువాత జగన్ సభలలో మాట్లాడే అవ్వా ఫ్యానూ, తాత ఫ్యానూ అనే స్క్రిప్టులు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షిలో లక్ష లోపే జీతం తీసుకునే జీవీడీ క్రిష్ణమోహన్ కి కూడా ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే..అంటే ఐదేళ్లలో 6 కోట్లు సాక్షి ఉద్యోగి సర్కారు సొమ్ము తేరగా తింటాడని జీవోలు వచ్చాయి. 
సొంత ఇంట్లో ఉన్నా నెలకు లక్ష అద్దె చెల్లింపు
అత్త సొమ్ము అల్లుడి దానం అనే సామెతను నిజం చేస్తూ ఏపీ ప్రజల సొమ్మును సాక్షి ఉద్యోగులకు చెల్లించేందుకు సలహాదారుల ముసుగు ఉపయోగపడింది. అయితే విచిత్రంగా నెలకు లక్ష అద్దెకింద చెల్లిస్తూ జీవో ఇచ్చారు. వీరికి సొంత ఇల్లున్నా లక్ష చెల్లింపు వర్తిస్తుంది. వివిధ అలవెన్సులు పేర్లు పెట్టి నెలకు ఒక్కొక్కరికీ 4 లక్షలు పైగానే చెల్లించేలా జీవో ఇచ్చారు. సాక్షిలో జీతం తీసుకుని పనిచేసే వీరు ఒక్కొక్కరి దగ్గర పనిచేసేందుకు 8 మందిని నియమించి...వీరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లించేలా జీవో ఇచ్చారు. అలాగే  ఒక్కొక్క సలహాదారుడి వాహనం కొనేందుకు 10 లక్షలు మంజూరు చేశారు. 
లక్షన్నరతో బంగారం స్పూన్లు కొన్నారా?
ఒక ఇంట్లో అవసరాలకు స్పూన్లు కొనాలంటే గరిష్టంగా ఎంత ఖర్చవుతుంది..మహా అయితే చాలా కాస్ట్లీవి, ఎక్కువ కొంటే వెయ్యి రూపాయిలు అవుతుంది. మన ముఖ్యమంత్రి సలహాదారుల కోసం బంగారం స్పూన్లు కొంటున్నారేమో కానీ ఒక్కో సలహాదారుడికి  స్పూన్లు కొనేందుకు రూ.1.50 మంజూరు చేశారు. ఫర్నిచర్ కింద మరో రూ.3 లక్షలు చెల్లింపు చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఒక్కో సాక్షి పెద్ద తలకాయ దగ్గర పనిచేసేందుకు 8 మంది ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటు కల్పించారు. వీరికి జీతాలు కింద నెలకు రూ.3లక్షలకు పైగానే ప్రభుత్వం చెల్లించనుంది.