రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అంతా రాజకీయమే

 


ప్రత్యర్థులపై ప్రతివ్యూహం 

 

 

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అంతా రాజకీయమే. దీనికి అభివృద్ధి, సంక్షేమం అంటూ పలు భాష్యాలు చెప్పడం అనవసరం. అమరావతి, పోలవరం, ఇలా ఒక్కటేమిటి, అన్నిటినీ రాజకీయ కోణంలోనుండి చూస్తేనే జరుగుతున్నదేమిటో అర్ధమవుతుంది. 

 

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబంపై కాంగ్రెస్ నేతలు కక్షగట్టినమాట వాస్తవం. పనిలో పనిగా తెలుగుదేశం కూడా రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని ఆదిలోనే తుంచేయాలని అలోచించి కాంగ్రెస్ పెద్దలకు తనవంతు సహాయం చేసింది. యూపీయే చైర్మన్ హోదాలో దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా చలామణి అవుతున్న సోనియా గాంధీ ఈ మొత్తం కుట్రను నెత్తికెత్తుకుని జగన్మోహన్ రెడ్డిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలని కేసులమీద కేసులు పెట్టించారు. అయినా ఆయన రాజీకి రాకపోవడంతో ఏకంగా జైలుకే పంపారు. 16 నెలలపాటు జైలులో ఉన్న జగన్, ఆ 16 నెలల కాలంలో రోడ్డుపైకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం... ఇవన్నీ రాజకీయంగా చూసినప్పుడు చిన్న విషయాలేమీ కావు. 16 నెలలు జైలు, 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, 14 నెలల పాదయాత్ర, ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరు ... ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవసరం అయ్యాయి? అధికార బలం, ధన బలం... ఈ రెండూ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాయి. ఇప్పుడు ఆ రెండూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్, టిడిపి అధికారం కోల్పోయాయి. ఇక కాంగ్రెస్, టిడిపి కోల్పోవలసింది ఆర్ధిక బలం. బడా కాంట్రాక్టుల ద్వారా సమకూరిన ధన బలం. దీనికోసమే అమరావతి, పోలవరం కాంట్రాక్టులపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ప్రత్యర్థులను రాజకీయంగా చిత్తు చేసిన తర్వాత వారి ఆర్ధిక మూలాలపై దాడి చేసి నిర్వీర్యం చేయాల్సి ఉంది. కౌరవులందరూ ఓటమిపాలై, దుర్యోధనుడు ఎక్కడో మడుగులో ఒంటరిగా తలదాచుకొని ఉన్నా కూడా కృష్ణుడు యుద్ధం ముగిసిందని భావించలేదు. భీముణ్ణి వెంటబెట్టుకొని వెళ్ళి దుర్యోధనుణ్ణి హతమార్చేలా చేశాడు. దుర్యోధనుడి అంతం కూడా అతని ఊరువుల్లో ఉందని తెలిసి అక్కడే దెబ్బ కొట్టాడు. అప్పుడు ముగిసింది యుద్ధం. ఇప్పుడు జరుగుతోంది అదే. తన ప్రత్యర్థుల బలం కాంట్రాక్టుల్లో ఉంది. అక్కడే దెబ్బ పడాలి. ఆ దెబ్బే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొడుతున్నారు. ఈ దెబ్బకు, సంక్షేమం, అభివృద్ధి అనే వాదనలు నాడు చివరి క్షణంలో కర్ణుడు, దుర్యోధనుడు చెప్పిన నీతి వాక్యాల్లాంటివే. యుద్ధం దుర్యోధనుడి తొడలు విరిగిన తర్వాతే ఆగింది. ఈ యుద్ధం ప్రత్యర్థుల ఆర్ధిక మూలాలు కుప్పకూలిన తర్వాతే ఆగుతుంది.  ఆ మూలాలు పోలవరం, అమరావతి కాంట్రాక్టులోనే ఉన్నాయి. ఆ మూలాలే తనను, తన కుటుంబాన్ని అవమానించి, కష్టాలపాలు చేశాయి. అందుకే ప్రతిదాడి. శత్రువు మరోసారి పైకి లేవకుండా ఊరువులపై గట్టి దెబ్బ వేస్తున్నాడు. రాజకీయంలో ఇది కృష్ణుడి వ్యూహం. ఇందులో సామాన్యులకు నష్టం లేదు. రెండు సింహాలు కొట్లాడుకుంటున్నప్పుడు అడవికి గానీ, మిగతా జంతువులకు కానీ వచ్చే నష్టమేమీ లేదు కావాలని ఆ సింహాల మధ్యలో దూరితే తప్ప.