దసరా ఏర్పాట్లు..వేగవంతం ఇంజనీరింగ్‌ అధికారులతో ఈవో సమీక్ష


దసరా ఏర్పాట్లు..వేగవంతం
ఇంజనీరింగ్‌ అధికారులతో ఈవో సమీక్ష
ఐదు వరుసలుగా క్యూలైన్లు
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
లడ్డూ ప్రసాదాలకు 12 కౌంటర్లు
మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. దుర్గా ఫ్లైఓవర్‌ వంతెన పనుల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నా.. ప్రభుత్వ శాఖల నుంచి తగినంతగా సహకారం లేకపోయినా దసరా ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు ఇబ్బందులు పడకుండా క్రమపద్ధతిలో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 29వ తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమై.. వచ్చేనెల 8వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పండుగగా నిర్వహించే దసరా ఉత్సవాల వైభవానికి ప్రతీకగా ఇంద్రకీలాద్రిని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు క్యూలైన్ల నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్‌బాబు దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో శుక్రవారం ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఇంద్రకీలాద్రి కొండపైన, దిగువన చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
క్యూలైన్ల నిర్మాణం వేగవంతం : దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను కొండ దిగువన కెనాల్‌రోడ్డులో ఉన్న వినాయకుని గుడి వద్ద నుంచి రెండు క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతిస్తారు. వినాయకుని గుడి వద్ద నుంచి రథం సెంటరు, దుర్గాఘాట్‌, టోల్‌గేట్‌, ఘాట్‌ రోడ్డు మీదుగా కొండపైకి క్యూలైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అటువైపు కుమ్మరిపాలెం వద్ద నుంచి మరో రెండు క్యూలైన్లను టోల్‌గేట్‌ వరకు నిర్మిస్తున్నారు. ఇరువైపులా నుంచి క్యూలైన్లలో వచ్చే భక్తులు టోల్‌గేట్‌ నుంచి కొండపైకి క్రమపపద్ధతిలో వెళ్లేందుకు మూడు వరుసలుగా క్యూలైన్లు నిర్మిస్తున్నారు. కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద నుంచి 5 వరుసలుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని క్యూలైన్ల పైన వాటర్‌ ఫ్రూప్‌ షామియానాలు, కింద కార్పెట్లు ఏర్పాటు చేయనున్నారు.
కొండపై ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు : సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని కొండపైకి వెళ్లినప్పటికీ చిన్న రాజగోపురం వద్ద వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది దసరా ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీఐపీలు వచ్చినప్పుడల్లా చిన్నరాజగోపురం వద్ద క్యూలైన్లలోని భక్తులను నిలిపివేయాల్సిరావడంతో భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఆ సమస్యను అధిగమించేందుకు రూ.300 టిక్కెట్టు కొనుగోలు చేసిన భక్తుల క్యూలైనుకు వీఐపీల వల్ల ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోయేందుకు కొండపై చిన్నరాజగోపురం ముందు ప్రత్యేకంగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రూ.300 టిక్కెట్టు కొన్న భక్తులు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి పై నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీలు ఈ బ్రిడ్జి కింది నుంచి చిన్నరాజగోపురం మెట్ల నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
శివాలయం మెట్ల ముందు హోమగుండాలు : క్యూలైన్లలో కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించున్న భక్తులు అటు శివాలయం మెట్ల మార్గం మీదుగా కిందికి దిగుతారు. దసరా ఉత్సవాలలో భవానీ మాల ధరించిన భక్తులు కూడా లక్షలాదిగా తరలివచ్చి ఇరుముడులను సమర్పిస్తారు. వారి కోసం శివాలయం మెట్ల హోమగుండాలను నిర్మిస్తున్నారు.
 కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు : అమ్మవారి దర్శనం చేసుకుని శివాలయం మెట్ల మార్గం మీదుగా కిందికి దిగివచ్చిన భక్తులు ప్రసాదాలను తీసుకునేందుకు వీలుగా కనకదుర్గానగర్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది పది కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది భక్తులు ఇంకా పెరుగుతారని అంచనా వేసి మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 12 కౌంటర్ల ద్వారా భక్తులకు లడ్డూ ప్రసాదాలను విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
శృంగేరీ మఠం వద్ద ఉచిత అన్నప్రసాదం : దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కొండ దిగువన అర్జునవీధిలో ఉన్న శృంగేరీ పీఠం వద్ద ఉచిత అన్నప్రసాదాన్ని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది భక్తులకు ఒకేసారి అన్నప్రసాదాన్ని అందించేందుకు వీలుగా శృంగేరీ పీఠం పక్కనున్న భవనంలో సిటింగ్‌ ఏర్పాట్లు, బపే పద్ధతిలో అన్నప్రసాదాన్ని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు తిరిగి వారి గమ్యస్థానాలకు వెళతారు.
సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. కొండపైన, దిగువన ఉన్న పరిసర ప్రాంతాలలో ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా క్షణాల్లో స్పందించేందుకు వీలుగా దుర్గాఘాట్‌ సమీపంలోని మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇంద్రకీలాద్రి పైన, దిగువన, కెనాల్‌రోడ్డు, ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్‌, అటు కుమ్మరిపాలెం వరకు, ఇటు వినాయకుని గుడి, కార్పొరేషన్‌ కార్యాలయం, గాంధీపార్కు వరకు, కృష్ణానదీ తీరాన ఉన్న ప్రధాన ఘాట్లలో అనువనువునా జల్లెడపట్టేలా నిఘా (సీసీ కెమెరాలు) ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసేందుకు వీలుగా పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సమాచార వ్యవస్థ మొత్తం సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానమై ఉంటుంది. అక్కడ నుంచే భద్రతా వ్యవస్థ మొత్తం పని చేస్తుంది.
26వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తి చేస్తాం : దసరా ఉత్సవాలు ఈనెల 29వ తేదీన ప్రారంభమవుతాయి. 26వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేస్తాం. రథం సెంటరు, కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద భక్తుల కోసం చెప్పుల స్టాండ్లు, సామాన్లు భద్రపరచుకునేందుకు క్లోక్‌రూములను ఏర్పాటు చేస్తాం. క్యూలైన్లలో ఉండే భక్తులకు నిరంతరం మంచినీటిని సరఫరా, చంటిపిల్లలకు పాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం రాజీవ్‌గాంధీ పార్కు, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్ల వద్ద నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున కొండపైన, దిగువన ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా మరో రెండు రోజులపాటు భక్తుల రద్దీ అలాగే కొనసాగే అవకాశం ఉందని, అందుకనుగుణంగా ఏర్పాట్లను కొనసాగిస్తాం.
ఎం.వి.సురేష్‌బాబు, దుర్గగుడి ఈవో