సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి రోజును దేశం ఉపాధ్యాయ దినోత్సవంగా

మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి రోజును దేశం ఉపాధ్యాయ దినోత్సవంగాజరుపుకుంటోంది.


ఒక నిరుపేద కుటుంబంలో 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించిన రాధాకృష్ణన్ గారి చదువంతా ఉపకారవేతనాలతోనే సాగింది. 
మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. అలా అధ్యాపక వృత్తిని మొదలుపెట్టి ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన'భారతీయ తత్వశాస్త్రం'అన్న గ్రంథం వ్రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్. 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది.