రైతు భరోసా' పథకాన్ని రైతులందరికీ వర్తింప చేయాలి


రైతు భరోసా' పథకాన్ని రైతులందరికీ వర్తింప చేయాలి
అమలాపురం :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ   వర్తింపచేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ డిమాండ్‌ చేసారు. స్థానికంగా ఆయన స్వగృహం వద్ద బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోకరకొండ గంగన్నస్వామి అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, కౌలు రైతులకు వర్తింప చేయనున్నట్లు ప్రకటించారన్నారు. రైతన్నకు వేరే కులం లేదని, కులాలకు, మతాలకు అతీతంగానే ఉద్యమాలైనా, ఉత్సవాలైనా వారంతా కలిసి జరుపుకోవడమే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఆ రైతులను ఎస్సీ, బిసి, ఓసిలుగా విభజించడం సరికాదన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా  రైతు భరోసా వర్తింపచేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేసారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు రైతు భరోసా పథకానికి ప్రకటించిన రూ.12,500లు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం చెల్లించే రూ.6వేలతో ముడిపెట్టడంతో రైతులు నష్టపోతున్నారని గుర్తు చేసారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అమలు చేసిన పథకాలను తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుందని అన్నారు. తాజా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కేంద్ర పథకాలను తన పథకానికి వినియోగించుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన రూ.12,500లు,   కేంద్రం ఇచ్చే రూ.6వేలు మొత్తం రూ.18,500లు ప్రతీ రైతుకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నల్లా పవన్‌కుమార్‌ డిమాండ్‌ చేసారు. అలా జరగకపోతే ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు జంగా రాజేంద్రకుమార్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్‌, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటా బాలయ్య, సీనియర్‌ నాయకులు బసవా సింహాద్రి, కిసాన్‌ మోర్చా నాయకులు చుండూరి నారాయణమూర్తి, కర్రి బలరామ్‌, కొలిశెట్టి ఈశ్వరరావు, నాయకులు అరిగెల నాని, సలాది నాగేశ్వరరావు, అయ్యల బాషా, వంకాయల వీరబాబు, కండిబోయిన దేవీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు