అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు . చంద్రబాబు

మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. మూడు నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. కోడెల టైగర్‌గా బతికాడని, భయం ఎరుగని వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారని అన్నారు. తెల్లారితే ఏం అవమానం చేస్తారో అని భయపడేంతగా హింసించి.. కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. టీడీపీ కార్యకర్తల హత్యలపై, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేశామన్నారు. కానీ కోడెల ఇలా ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుందని అస్సలు ఊహించలేదని చంద్రబాబు తన బాధను వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాక్షసంగా, అమానవీయంగా ప్రత్యర్థులపై పడుతున్నారని మండిపడ్డారు. కోడెల పోరాటయోధుడని, ఎన్ని సమస్యలు, కేసులు వచ్చినా పోరాడదామని గతంలో తనను కలిసినప్పుడు చెప్పానని అన్నారు. కానీ ప్రభుత్వం చేస్తోన్న అవమానాలను కోడెల భరించలేకపోయారని, విచారణ, దర్యాప్తు పేరుతో వెంటాడి వేధించారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.