మహాత్ముని ఆశయాలను చాటిచెప్పడానికే సంకల్పయాత్ర : రఘురామ్‌


మహాత్ముని ఆశయాలను చాటిచెప్పడానికే సంకల్పయాత్ర : రఘురామ్‌



అమలాపురం :
జాతిపిత మహాత్ముని ఆశయాలను గ్రామాల్లో చాటి చెప్పడానికి మనసులో బాపూజీ సంకల్పయాత్ర కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టిందని జాతీయ రాష్ట్ర సమన్వయ కర్త, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురామ్‌ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన మనసులో బాపూజీ పాదయాత్ర మంగళవారం నాడు అమలాపురం విచ్చేసింది. పాదయాత్రకు స్థానిక గోఖలే సెంటర్‌లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం గడియారస్తంభం సెంటర్‌లోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్‌ మాట్లాడుతూ గ్రామాణాభివృద్ది పల్లె ప్రగతి కోసం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్ల నిర్మాణం, కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా, ప్రధాని గ్రామీణ సడక్‌ యోజనలో భాగంగా పక్కా తారురోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉచిత విద్యుత్‌ సహకారం, రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సహాయం,  రైతున్నలకు ప్రత్యేక పింఛను పథకం, తదితర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభివృద్ది, సంక్షేమ పథకాలను  ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పవన్‌కుమార్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాలు బీజేపీతోనే సాధ్యమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ్‌  సత్యగోపీనాధ్‌ దాస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర కార్యక్రమంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్‌.వి.నాయుడులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు సంసాని వెంకటరత్నకుమార్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణసుందర్‌, జంగా రాజేంద్రకుమార్‌, మోకా వెంకట సుబ్బారావు, మజ్దూర్‌ మోర్చా రాష్ట్ర నాయకులు ఆకుల వీరబాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్‌, పెయ్యల శ్యామ్‌ప్రసాద్‌, అడబాల సత్యనారాయణ, అయ్యల బాషా, అరిగెల నాని, కాటా బాలయ్య, పాలూరి సత్యానందం, చిట్టూరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


--------------------------------------------