12న డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం

 







డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 12న వివిధ రంగాలలో విశిష్టతను చాటిన ప్రముఖులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేయనున్నట్టు ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మ ప్రచారక్‌ రామినేని తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఓ హౌటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఫౌండేషన్‌ కన్వీనర్‌ నాగభూషణం, సభ్యులు చిత్తరంజన్‌లతో కలిసి ఆయన సంబంధిత బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్‌ రామినేని చౌదరి అమెరికాలో స్థిరపడి భారత దేశం పై అమితమైన ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫౌండేషన్‌ నెలకొల్పినట్టు చెప్పారు. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ఎంపిక చేయగా, విశేష పురస్కారాలకు సంస్కృతీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రముఖ కూచిపూడి కళాకారిణి ఏబీ బాల కొండలరావు, రచయిత, గాయకుడు గోరేటి వెంకన్నలను ఎంపిక చేశారని చెప్పారు. 12న నక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో జరిగే పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హాజరై అవార్డులను అందజేస్తారని తెలిపారు.