జి .కొండూరు సప్తగిరి బ్యాంకులో ఖాతాదారులు అవస్థలు

 


జి.కొండూరు సప్తగిరి బ్యాంకులో ఖాతాదారులు అవస్థలు



_కృష్ణాజిల్లా జి.కొండూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఖాతాదారులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో అప్పుడప్పుడు సర్వర్, ఆన్లైన్ పని చేయక సాంకేతికమైన సమస్యలతో ఖాతాదారులకు సేవలో చాలా ఆలస్యం అవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి బ్యాంకు తెరుస్తుతున్నపటికీ ఒక్కోసారి మధ్యాహ్నం పన్నెండు, ఒంటి గంట సమయం వరకు కూడా డిపాజిట్లు, నగదు స్వీకరణ, విత్ డ్రా సొమ్ము ఇవ్వటంలేదు. ఇదేమిటని అడిగితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఖాతాదారుల సొమ్ము కూడా నగదు రూపంలో ఇవ్వకుండా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామని అధికారులు పేర్కొంటునట్లు ఖాతాదారులు బహిరంగంగా వాపోతున్నారు. దీని వల్ల సకాలంలో నగదు రూపంలో సొమ్ము అందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ ప్రాణాల మీదకు వచ్చిన పరిస్థితుల్లో ఖాతాలో సొమ్ము ఉన్నప్పటికీ బ్యాంకు అధికారులు సకాలంలో నగదు రూపంలో ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న నగదును ఏకకాలంలో ఎక్కువ మొత్తంలో  చెల్లించడానికి బ్యాంకు  సిబ్బంది అంగీకరించటం లేదు. బ్యాంక్ ఉన్నతాధికారుల నుంచి తమకు మాట వస్తుందని... నెల చివరి సమయంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో సొమ్ము తిరిగి ఇవ్వడం కుదరదని  ముక్తసరిగా పేర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఖాతాదారులపై చిరాకు పడుతున్నారు. పోనీ "మీరు చెప్పిన విషయాన్ని ఒక తెల్ల కాగితంపై రాసి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇవ్వండి" అని ఖాతాదారులు అడిగితే "మేము అట్లా ఎలా ఇస్తారని" బ్యాంక్ సిబ్బంది, అధికారులు తిరిగి ప్రశ్నిస్తున్నారు. సప్తగిరి జి.కొండూరు బ్రాంచ్ లో సిబ్బంది కొరత కారణంగా సేవలు చాలా ఆలస్యం అవుతున్నాయి. ఇక బ్రాంచ్ లో ఏర్పాటుచేసిన ఆధార్ నమోదు సేవ కేంద్రం కారణంగా సేవలు మరింత ఆలస్యం అవుతున్నాయి. గంటలతరబడి బ్యాంకులో క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. రోజువారి సాధారణ ఖాతాదారులకు... ఆధార్ నమోదు కేంద్రం కారణంగా సేవల్లో ఆలస్యం జరుగుతుంది. ఆధార్  నమోదుకు సంబంధించి బ్యాంకులో 50 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నమోదుకు వచ్చినవారిని.... బ్యాంక్ ఖాతాదారులను ఒకే రకంగా క్యూలైన్లలో నుంచో పెట్టి ఖాతాదారుల విలువైన సమయాన్ని హరించేస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగిన తర్వాత ఖాతా పుస్తకాల్లో స్టేట్మెంట్లు కూడా వెంటనే నమోదు చేయకుండా ఇస్తున్నారు.  స్టేట్మెంట్ నమోదు చేయమని అడిగితే  రెండు గంటల సమయం తర్వాత మళ్ళీ రమ్మని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికైనా సప్తగిరి బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారుల ఇబ్బందులను విచారించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది._