క‌స్ట‌మ‌ర్ల‌కు జియో జ‌ల‌క్‌.. కాల్స్ చేస్తే డ‌బ్బులు చెల్లించాల్సిందే

*క‌స్ట‌మ‌ర్ల‌కు జియో జ‌ల‌క్‌.. కాల్స్ చేస్తే డ‌బ్బులు చెల్లించాల్సిందే*


హైద‌రాబాద్‌: టెలికం రంగంలోకి అడుగుపెట్టి అనతికాలంలో దూసుకుపోయిన రిలయన్స్ జియో..వినియోగదారులకు షాకిచ్చింది. ఇకపై జియో నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే ప్రతి కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డాటాను తిరిగి అందిస్తున్నట్లు ప్రకటించింది. ఐయూసీ చార్జీల విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే జియో నెట్‌వర్క్‌కు కాల్స్‌కు ఎలాంటి చార్జీలు విధించబోమని స్పష్టంచేసింది. అలాగే ఇన్‌కమ్మింగ్ కాల్స్‌కు, ల్యాండ్ లైన్స్, వాట్సప్ వినియోగం, ఫేస్‌టైం, ఇతర ప్లాట్‌ఫామ్ కింద ఎలాంటి రుసుమూ వసులు చేయబోమని ప్రకటించింది. 2017లో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను నిమిషానికి 14 పైసల నుంచి ఆరు పైసలకు తగ్గించిన ట్రాయ్.. 2020 జనవరి తర్వాత పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నది. టెలికం సేవలు ఆరంభించిన మూడేండ్ల నుంచి తన పోటీదారులైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలకు ఐయూసీ చార్జిల కింద జియో రూ.13,500 కోట్ల చెల్లింపులు జరిపింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నెల 10 తర్వాత రీచార్జి చేసే వారికి ఈ చార్జిలు వర్తిస్థాయని తెలిపింది. ఇప్పటి వరకు జియో వినియోగదారులు కాల్స్‌కు ఎలాంటి చార్జీలు చెల్లించడం లేదు. కేవలం డాటాకు మాత్రమే చెల్లిస్తున్నారు.