సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుపై సస్పెన్షన్ వేటు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుపై సస్పెన్షన్ వేటుపడింది. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హు జూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాపార్టీ (టీపీపీ) అభ్యర్థి సాంబశివగౌడ్‌కు మద్ద తు ఇవ్వాలని పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారి లిఖితపూర్వకంగా ఇచ్చినా నామినేషన్ గడువులోపు సరైన పత్రాలు అందించకపోవడంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని గుర్తించిన సీపీఎం రాష్ట్ర కమిటీ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావును సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యానికి కారణమైన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములును జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం, పార్టీ నాయకులు జీ నాగయ్య, వెంకట్, డీజీ నరసింహరావుతో కలిసి మాట్లాడుతూ సాంబశివగౌడ్‌ను గెలిపించాలని కోరారు.