ఆర్టీసీ ప్రైవేటీకరణకు మేఘా ప్రణాళికతోనే పథక రచన - రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు . డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ నష్టపోతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

 

''నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదు. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. గౌలిగూడలో భూములను టీఆర్‌ఎస్‌ ఎంపీ లీజుకు తీసుకున్నారు. ఆర్టీసీ భూముల లీజుల వివరాలు సంస్థ బయటపెట్టాలి'' అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.