కర్నూలు సీఐ రామయ్యనాయుడు అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలకు చిక్కాడు. 

కర్నూలు సీఐ రామయ్యనాయుడు అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలకు చిక్కాడు. 


న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండునెలల క్రితం సభ్యులను మోసిగించిన అభియోగంపై నవకాంత్‌ చిట్‌ఫండ్‌ సంస్థపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అధికారులు సీఐ రామయ్యనాయుడుకు అప్పగించారు. 
ఈ క్రమంలో సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సీఐ రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేశారు.
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆదినారాయణరెడ్డి బంధువు శివరామిరెడ్డి.. ఈనెల 13న అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. 
సోమవారం సీఐ రామయ్యనాయుడు ఇంటి సమీపంలోని ఓ హోటల్‌ ఆవరణలో న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సీఐని కూడా అరెస్టు చేసినట్లు అనిశా డీఎస్పీ నాగభూషణం తెలిపారు. 
మరోవైపు రామయ్యనాయుడు ఇంట్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆస్తులు పట్టుబడితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.