చీఫ్ సెక్రటరీ పై వైఎస్ జగన్ ఆగ్రహం !ముచ్చటగా మూడో చీఫ్ సెక్రెటరీ .

చీఫ్ సెక్రటరీ పై వైఎస్ జగన్ ఆగ్రహం !ముచ్చటగా మూడో చీఫ్ సెక్రెటరీ ... 


త్వరలోనే రాష్ట్రానికి మూడో చీఫ్ సెక్రెటరీ ...
సచివాలయంలో హాట్ టాపిక్ గా మారిన సీఎస్ మార్పు వార్త... 
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా బయటపడిన నిజం... 
కొత్త సీఎస్ ఎవరు కాబోతున్నారు అంటూ ఊహాగానాలు...


అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ముగ్గురు సీఎస్ లను మార్చిన ముఖ్యమంత్రి గా జగన్ రికార్డు సృష్టించబోతున్నారా?ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో జరగనిది,ఎక్కడా వినని వార్త అతి త్వరలోనే మనం వినబోతున్నామా?అవుననే అంటున్నాయి సచివాలయం వర్గాలు.వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఐఏఎస్,ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు.అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించారు.మీరే ఈ తమ్ముడిని ముందుకు నడిపించాలి అన్నారు.అప్పుడు అధికారుల ఆనందానికి అవధులు లేవు కానీ 10 నెలల్లోనే సీన్ రివర్స్ అయ్యింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కి చుక్కలు చూపించిన ఎల్వీ.సుబ్రహ్మణ్యం ని సీఎస్ గా కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నారు.కానీ ఇద్దరి బంధం ఐదు నెలల ముచ్చటే అయ్యింది.ఎమ్మార్ కేసులో జగన్ సహా నిందితుడిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో పడిన ఇబ్బందుల దృష్ట్యా కాస్త జాగ్రత్త పడటం ప్రారంభించారు.పీపీఏలు,రివర్స్ టెండరింగ్,మూడు రాజధానులు,సలహాదారుల నియామకం ఇలా అన్ని విషయాల్లో జగన్ మార్క్ ఎలా ఉంటుందో తెలిసి ఎల్వీ ఆచితూచి వ్యవహరించడం ప్రారంభించారు.ఎక్కడా న్యాయపరంగా దొరికిపోకుండా జాగ్రత్తపడి జగన్ తీసుకున్న నిర్ణయాలు యుద్ధప్రాతిపదికన అవ్వకుండా మోకాలడ్డారు.దింతో ఆయన జగనాగ్రహానికి గురికాక తప్పలేదు.సీఎస్ తో సంబంధం లేకుండా జీఏడీ అధిపతి గా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్,సిఎంఓ లో ఉన్న రెడ్డి పరివారం ఒక్కటైంది.సీఎస్ తో సంబంధం లేకుండా ఫైల్స్ ముందుకు కదలడం ప్రారంభం అయ్యింది.షో కాజ్ లేఖల యుద్ధం అనంతరం సీఎస్ ఎల్వీ కింది స్థాయి ఉద్యోగి అయిన ప్రవీణ్ ఎల్వీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.అక్కడితో ఎల్వీకి ఎండ్ కార్డు వేసారు జగన్.దేశ వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల్లో ఈ చర్య పెను ప్రకంపనలు సృష్టించింది.ఆ తరువాత కొన్ని రోజులు సేదతీరడానికి ఎల్వీ అమెరికా వెళ్లడం అందరికి విదితమే.ఆ తరువాత రెండో సీఎస్ ఎవరు అనే చర్చ జరిగింది.అయితే అనూహ్యంగా కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సాహ్ని ని సీఎస్ గా జగన్ నియమించారు.అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో మళ్లీ ఐదు నెలల సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యింది.ఇందులో పెద్దగా ఆమె తప్పు ఏమి లేకపోయినా ఆమె బలి అవుతుంది అని సీనియర్ అధికారుల్లో చర్చ జరుగుతుంది.ముఖ్యమంత్రి,సీఎస్ మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో చెప్పడానికి ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఒక ఉదాహరణ అని చెబుతున్నారు.అనేక కీలక పదవులు నిర్వహించి ప్రస్తుత సీఎస్ గా ఉన్న ఒక మహిళా అధికారి ఎంతో గౌరవంతో నమస్కారం పెట్టినా కనీసం ఆవిడకి తిరిగి నమస్కారం పెట్టడం కానీ,చూసినా ఆమెని పట్టించుకోకుండా వెళ్లిన విధానం ఇప్పుడు సీనియర్ అధికారులు,సచివాలయంతో చర్చ అయ్యింది.ఇంతకీ ఎక్కడ తేడా కొట్టింది అని లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా నేపథ్యంలో ఎన్నికల వాయిదా వెయ్యడం.ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.దినికి ప్రతిగా ముఖ్యమంత్రి డైరక్షన్ లో అధికారాలను లెక్కచెయ్యకుండా తప్పు చేస్తున్నాం అని తెలిసి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని లేఖ రాసారు నీలం సాహ్ని.అయితే ఆ తరువాత సుప్రీం కోర్టు కి వెళ్లిన ప్రభుత్వానికి చుక్కెదురైంది.ఆ తరువాత ఎన్నికల సంఘం ఉత్తర్వులు మేరకు ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఉపక్రమించారు సీఎస్.ఇదే ముఖ్యమంత్రి కి రుచించని విషయం.ఆవిడ ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం.సిఎంఓ లో ఉన్న రెడ్డి పరివారం ద్రుష్టి కి వాస్తవాలు తీసుకెళ్లే ప్రయత్నం చేసారు.ఒక వేళ ఎన్నికల సంఘం ఉత్తర్వులు మేరకు చర్యలు తీసుకోక పోతే మరో సారి కోర్టు మొట్టికాయలు తప్పదని ఆమె వివరించారు.అయితే సిఎంఓ లో కీలకంగా ఉన్న రెడ్డి గారు అందుకు అంగీకరించలేదు.ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.ఆమె నిర్ణయం తీసుకోని బదిలీ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే ఆమె పై వేటు తప్పదు అని అంటున్నారు.ఇక మూడో సీఎస్ ఎవరు అనే చర్చ సచివాలయంలో తీవ్రమయ్యింది.మూడో సీఎస్ ఎవరు ?ఎక్కడి నుండి రాబోతున్నారు?ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు.ఇక పై ఇటువంటి సమస్యలు లేకుండా చెప్పిన ప్రతి నిర్ణయం వెంటనే అమలు అయ్యేలా ఒక నికార్సైన రెడ్డి సామజిక వర్గ అధికారి సీఎస్ కాబోతున్నారు అంటూ సచివాయలంలో హాట్ టాపిక్ గా మారింది.