ఎట్టకేలకు నిన్న ఒక ప్రత్యేక రైలు గొల్లకొండ నుండి 'వలస కూలీలను' ఎక్కించుకుని

 


ఎట్టకేలకు నిన్న ఒక ప్రత్యేక రైలు గొల్లకొండ నుండి
'వలస కూలీలను' ఎక్కించుకుని జార్ఖండ్ రాష్ట్రం బయలుదేరింది!


దాదాపు నెలా తొమ్మిది రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ తరువాత కదిలిన మొదటి రైలు ఇది!
ఈ నెలా తొమ్మిది రోజుల పాటు వారిది' అరిఘోష'
అంటే? శతృ ఘోష- శతృవులు పెట్టిన బాధలు అని!
సొంత దేశంలో లక్షలాది మంది వలస కూలీలు ఎన్ని యాతనలకు గురయ్యారో?


గొల్లకొండ మహానగరం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రోడ్డు మార్గాన నడిచి వెళ్తున్న దృశ్యాలు చూస్తుంటే, దేశ విభజన నాటి దారుణమైన వలస దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి!
కొద్దిపాటి ముఖ్య వస్తువుల మూటలు నెత్తిన పెట్టుకొని- పిల్లల్ని చంకనేసుకుని- తీవ్రమైన ఏప్రిల్ నెల ఎండల్లో - వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి వారి స్వగ్రామాలకు పయనమయ్యారు!


ప్రభుత్వ అకస్మాత్తు నిర్ణయం , వలస వచ్చిన కార్మికుల 
మీద పిడుగు పాటు లాగా పడింది!
రెక్కల కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవారు,ప్రభుత్వాల బోగస్ మాటలు నమ్మరు!
అందుకే వారు ఎవరిదారి వారు చూసుకున్నారు-
చావో బ్రతుకో తమవారితో కలిసే అని బయలుదేరారు!
అయినా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు!


సంగారెడ్డి దగ్గర ఏదో ఒక అతిపెద్ద భవన నిర్మాణ కంపెనీ పనిలో నిమగ్నమై ఉన్న వలస వచ్చిన కార్మికులు మొన్న గొడవకు దిగితే- పోలీసులు వచ్చి అదుపుచెయ్య ప్రయత్నం చేస్తే- కోపోద్రిక్తులైన కార్మికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేస్తే ,
ఆఘమేఘాల మీద వారితో జిల్లా ఉన్నత యంత్రాంగం చర్చలు జరిపారు!
ఎట్టకేలకు వారితోనే మొట్టమొదటి వలస కూలీల రైలు బయలుదేరింది!
అంతకుముందు పదిహేను రోజుల క్రితం ముంబై రైల్వే స్టేషను వద్ద వేలాది మంది వలస వచ్చిన కూలీలు తమను స్వస్థలాలకు పంపమని ధర్నాకు దిగారు!
ఏ ప్రతిపక్షాలు వారికి మద్దతుగా ఒక్క మాటా మాట్లాడలేదు!


ఈ ప్రభుత్వాలు ఎలాంటివీ అంటే, ప్రజల పాలిట సమస్త సమస్యలకు అవే కారణం!
ఉపేక్షా వైఖరితో వాటిని మరింత జటిలమైన సమస్యలుగా మారుస్తాయి!


మొదట వూహాన్ నుండి ప్రత్యేక విమానాల ద్వారా- తరువాత ఇతర దేశాల నుండి యధావిధిగా- కరోనా వైరస్ దేశంలోకి అడుగు పెట్టడానికి కారణం ప్రభుత్వమే!
ధర్మల్ స్క్రీనింగ్ అని హడావుడి పరీక్షలు చేసి విమానాశ్రయాల నుండి కరోనా వైరస్ బయటకు అడుగు పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వమే కారణం!


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంటే,ఢిల్లీలో ఒక అంతర్జాతీయ మత సదస్సు జరుగనిచ్చిందీ ప్రభుత్వమే!
ఆ సదస్సు నుండి రెండో విడత వైరస్ వ్యాప్తికి కారణం ప్రభుత్వమే!
ఒక్కరోజు క్వారంటైన్ అని అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిందీ ప్రభుత్వమే!


ప్రజలకు నాలుగురోజుల వెసులుబాటు ఎందుకని ఇవ్వలేదు?
మన ప్రభుత్వానికి అట్టడుగున ఉన్న ప్రజల గురించి ఆలోచనలు చేసే మనస్తత్వం లేదు!


సామాజిక సంక్షోభాలకు ప్రభుత్వ విధానాలే కారణం!
ఆ సంక్షోభాలు తమ ఉనికికే ప్రమాదంగా మారేసరికి తిరిగి హడావుడి నిర్ణయాలు!
సకాలంలో మేల్కొని వారు,సంక్షోభాల మధ్యనే మేల్కొంటారు!


***


ప్రపంచ ఒకటే కానీ, అందులో అనేక ప్రపంచాలు!
అందులో ఎవరి ప్రపంచం వారిదే!
అందరి ప్రపంచాలను నిర్మించే భవన నిర్మాణ కార్మికుల ప్రపంచం , సాధారణంగా ఏ ప్రపంచం వారికీ పట్టదు!


***


గత నాలుగువందల ముప్పై అయిదు సంవత్సరాలుగా హైదరాబాదు నగరాన్ని నిర్మిస్తూ వస్తున్నది ఈ వలస వచ్చిన కూలీలే!
నగర నిర్మాత అని చెప్పబడుతున్న మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాదు- తనకు తానుగా చెప్పుకున్న చంద్రబాబునాయుడు కాదు- లక్షలాది మంది వలస వచ్చిన కూలీలే అసలైన నిర్మాతలు!


గొల్లకొండ నగర నిర్మాణ చరిత్రే కాదు,ప్రపంచంలోని అన్ని నగర నిర్మాణాల చరిత్రలు కూడా అలాంటి చరిత్రలే!
శిలాఫలకాల మీద మటుకు అనర్హుల పేర్లు ఉంటాయి!


మనకు నీడను కల్పించిన వారికి మనం నీడను లేకుండా చెయ్యడమే ఇది!


వ్యవస్థ స్వభావమే అంత!
అది సకల సంపదలను సృష్టించే వారి వైపు నుండి ఆలోచించదు!
అది మన మధ్యతరగతి మనుషుల కంటే, అట్టడుగు వర్గాల ప్రజలకే వ్యవస్ధ స్వభావం బాగా తెలుసు!
అందుకే తమ రెక్కలను తాము నమ్ముకున్నట్టు,తమ కాల్లను తాము నమ్ముకోవడం!
అందుకే ఈ  'మహా ప్రస్థానం' 
విషాద వలస ప్రస్థానం!


***


తమను తాము అమ్ముకున్న వారికి,తమను తాము నమ్ముకునే వారు అర్థం కారు!
వలస కూలీలు తమను తాము నమ్ముకున్న వారు!


***
వలస కార్మికులకు క్షమాపణలు!
ఎందుకు అంటే?
ఈ మహానగరంలో వారు నాకూ ఓ ఇల్లు కట్టి పెట్టారు!
అందుకు!
వ్యవస్థలో భాగమైన మనం పొందినది ఎంత?
మనకు ఇండ్లను కట్టిన కూలీలకు మనం ఇచ్చింది ఎంత?
మన జీవన ప్రమాణాలు ఏవి?
వారి జీవన ప్రమాణాలు ఏవి?
లెక్కలకు అందని కఠిన వాస్తవాలు ఇవి!
కఠువైన మాటలు ఇవి!